అధ్యక్ష పదవికి ముషారఫ్ రాజీనామా చేయడం పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ముషారఫ్ రాజీనామాపై అభిప్రాయం చెప్పాల్సిందిగా విలేకరలు కోరగా ఆయన పై విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ ఇటీవలి తన పాకిస్థాన్ పర్యటనను గుర్తు చేసుకున్నారు. తాను పాకిస్థాన్ సందర్శించిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వై పాక్షిక సంబంధాలు మెరుగు పడేందుకు అవసరమైన చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఇరుదేశాల సెక్రటరీల స్థాయి చర్చలు త్వరలోనే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
పాక్ పర్యటన సందర్భంగా అక్కడి నేతలైన నవాజ్ షరీఫ్, అసీఫ్ అలీ జర్ధారీ, యూసఫ్ రజా గిలానీలతో తాను చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. ఈ చర్చలన్నీ కూడా పాకిస్థాన్ నేతలతో సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకేనని ఆయన పేర్కొన్నారు. పాక్ నేతలతో తాను సాగించిన చర్చల్లో ద్వైపాక్షిక, అంతర్జాతీయ స్థాయి అంశాలు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు.
|