కాశ్మీర్ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ అనుసరిస్తున్న వైఖరి పట్ల పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన అత్యంత ప్రమాదకరమైన విభజన క్రీడను ఆడుతున్నారని పిడిపి ఆరోపించింది. దీనిపై ఆ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జమ్మూ కాశ్మీర్ ఉద్రిక్తలను భారతీయ జనతా పార్టీ తమ రాజకీయ స్వలాభాల కోసం వినియోగించుకుంటోందన్నారు. ఈనెల 25వ తేదీన శ్రీ అమర్నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) ఆధ్వర్యంలో జరుపతలపెట్టిన ర్యాలీకి అద్వానీ నాయకత్వం వహించడాన్ని ఆమె తప్పు పట్టారు.
అద్వానీని ప్రధానిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో మత శక్తులకు భారతీయ జనతా పార్టీ బహిరంగ మద్దతు తెలుపుతోందని ఆమె ధ్వజమెత్తారు. ఇది దేశానికే అత్యంత ప్రమాదకరమన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ అల్లర్ల తర్వాత భాజపా తిరిగి తన మూలాల్లోకి వెళుతూ.. దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
|