జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మధుకోడా రాజీనామా చేశారు. దీంతో గత వారం రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. జార్ఖండ్ ముక్తి మోర్ఛా అధినేత శిబూ సోరెన్ ముఖ్యమంత్రి పదవి చేట్టేందుకు వీలుగా, మధుకోడా రాజీనామా చేశారు. యూపీఏ అగ్రనాయకత్వం సూచన మేరకే కోడా రాజీనామా చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో విశ్వాస పరీక్షలో యూపీఏకు మద్దతిచ్చిన శిబుసోరెన్కు తానాశించిన ప్రయోజనం నెరవేరనుంది.
మధుకోడా రాజీనామాతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సోరేన్కు అంటు కాంగ్రెస్తో పాటు.. ఆర్జేడీలు మద్దతు ఇవ్వనున్నాయి. ఏడుగురు సభ్యులు కలిగిన ఆర్జేడీ.. ఈ మేరకు మద్దతు లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ సిబ్తే రజీకి పంపినట్టు ఆర్జేడీ నేతలు వెల్లడించారు. మధుకోడా రాజీనామా చేసేముందు.. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశమై చర్చలు జరిపారు.
ఆ తర్వాతే గవర్నర్ సయ్యద్ సిబ్తె రజీని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. మధుకోడా వెంట ఐదుగురు స్వతంత్ర ఎమ్మెలు ఉన్నారు. వీరిలో స్టీఫన్ మరాండీ, జోబా మఝి, వాంద్రా ప్రకాష్ చౌదరి, భాను ప్రతాప్ సాహి, హరినారాయణ్ రాయ్. వీరంతా రాష్ట్ర మంత్రులే కావడం గమనార్హం.
జెఎంఎం మద్దతు ఉపసంహరణతో తమ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని అందువల్లే రాజీనామా చేస్తున్నట్టు మధుకోడా తర్వాత విలేకరులకు తెలిపారు. 2006 సెప్టెంబరులో మధుకోడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అతి చిన్న వయస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా మధుకోడా బాధ్యతలు చేపట్టడం గమనార్హం.
|