భారత్-అమెరికా అణు ఒప్పందం అమలుకు అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్జి) సభ్య దేశాల షరతులకు తలొగ్గబోమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అయితే అణు వ్యాపారం కోసం ఎన్ఎస్జి సభ్య దేశాలు భారత్కు ప్రత్యేక మినహాయింపు ఇస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అణు ఇంధన సరఫరా గ్రూపు (ఎన్ఎస్జీ) దేశాల నుంచి భారత్ బేషరతు మినహాయింపును ఆశిస్తుందని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.
భారత్కు ఎన్ఎస్జీ దేశాలు ఎటువంటి షరతులు ప్రతిపాదించాయో చూడలేదు. వాటిని తెలుసుకున్న అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అణు సరఫరా గ్రూపు సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలను విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ తన దృష్టికి తెచ్చారని ముఖర్జీ వెల్లడించారు.
అంతకుముందు వియన్నాలో రెండు రోజులపాటు జరిగిన అణు సరఫరా గ్రూపు (ఎన్ఎస్జీ) దేశాల కీలక సమావేశం నిర్మాణాత్మంగా, ఉపయోగకరంగా సాగిందని ఈ సమావేశంలో పాల్గొన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ తెలిపారు.
ఇతర దేశాలతో అణు వాణిజ్యం జరుపుకునేందుకు తమపై విధించిన నిషేధాన్ని తొలగించాలని భారత్ ఈ సమావేశంలో ఎన్ఎస్జీ దేశాలను కోరిన సంగతి తెలిసిందే. కాగా, అణు వాణిజ్యం కోసం అమెరికా ఒక ముసాయిదాను తయారు చేసి ఎన్ఎస్జికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన అణు సరఫరా సభ్య దేశాలు ఈ ముసాయిదాలో మార్పులు చేర్పులు చేయాలని సూచించాయి.
|