జమ్మూకాశ్మీర్లో మళ్ళీ ఘర్షణలు తలెత్తాయి. సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచే నిరవధిక కర్ఫ్యూ విధించడంతో కాశ్మీర్లోయ, బందీపూరా ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కర్ఫ్యూ ఉల్లంఘనకు యత్నించిన జెకెఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దాంతో ఆగ్రహించిన ఆందోళన కారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్, భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. కొన్ని చోట్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, 65 మంది ఆందోళనకారులు గాయాలకు గురైయ్యారు.
ఇదిలా ఉండగా, ఆదివారం జరిగిన అల్లర్లను అదుపుచేసినందుకు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో 105 మంది గాయాలపాలయ్యారు. గాయాలకు గురైన వారిలో 24మంది భద్రతా దళ సిబ్బంది కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారిక వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని కుపరా, బీర్వాగ్, బుద్గం, శ్రీనగర్ బాలాముల్లా హైవే ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 25మందికి పైగా ప్రజలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
|