స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఆరువారాలు పొడిగిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సిమిపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సిమి ఉగ్రవాద సంస్థా లేక ప్రజాహిత సంస్థా అనే దానిపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు సిమిపై నిషేధాన్ని మరో ఆరువారాల పాటు కొనసాగిస్తూ... కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 24న ఉంటుందని సుప్రీం ప్రకటించింది.
ఇదిలా ఉండగా, సిమిపై 2001లో తొలుత నిషేధం విధించారు. చట్ట వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడుతుండటంతో నిషేధం విధించారు. సిమీ కార్యకర్తలు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థతో సంబంధాలు కలిగివున్నట్టు నిఘా సంస్థలు నిగ్గుతేల్చాయి.
దీంతో సిమీపై తొలుత నిషేధం విధించగా, ఇది ప్రతి రెండేళ్ళకొకసారి పొడగించేలా నిర్ణయించారు. అయితే.. ప్రస్తుతం మూడోసారి నిషేధం విధించేందుకు అవసరమై ఆధారాలను కేంద్ర హోం శాఖ సమర్పించలేక పోయిందని పేర్కొంటూ.. ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ట్రిబ్యునల్ నిషేధాన్ని గతంలో ఎత్తివేసిన సంగతి తెలిసిందే.
|