ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలు సెప్టెంబరు మొదటి వారంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేవి.తంగబాలు తెలిపారు. దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల మొదటి వారంలో వచ్చే వీరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.
నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జరిగే ఈ పర్యటన సందర్భంగా మద్రాసు విశ్వవిద్యాలయం 150వ వార్షికోత్సాల్లో పాల్గొంటారని చెప్పారు. వీరిద్దరికి గౌరవ డాక్టరేట్లను యూనివర్శిటీ అందజేస్తుందని చెప్పారు. ఆ తర్వాత సేలం స్టీల్ ప్లాంట్కు వారు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈరోడ్లో జరిగే బహిరంగ సభలో ఇద్దరు నేతలు పాల్గొని ప్రసంగిస్తారని తంగబాలు చెప్పారు. వీరి పర్యటన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
అనంతరం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ.. డీపీఏ కూటమి నుంచి వైదొలగిన పీఎంకే తిరిగి తమ కూటమిలోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మునుగుతున్న నౌకగా వ్యాఖ్యానించడం పట్ల తంగబాలు స్పందిస్తూ.. మాది అతి పెద్ద నౌక. అది మునిగి పోతున్న వారిని రక్షిస్తుంది. సముద్రంలో మునిగి పోయేది లెఫ్ట్ నౌక మాత్రమేగానీ, కాంగ్రెస్ ఓడ కాదన్నారు.
|