ఒరిస్సా రాష్ట్రంలోని కందమాల్ జిల్లాలో చెలరేగిన హింస కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను పోలీసులు జారీ చేశారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా సంఘ్ పరివార్ నేత స్వామి లక్ష్మణానంద సరస్వతితో సహా మరో నలుగురిని గుర్తుతెలియని సాయుధ దుండగులు హతమార్చిన విషయం తెల్సిందే.
ఈ హత్య ఒరిస్సా రాష్ట్రంలో శాంతిభద్రలు అదుపుతప్పేందుకు దారితీసింది. ఈ హత్యకు కారకులైన వారిని తక్షణం గుర్తించి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఒరిస్సా అసెంబ్లీ అట్టుడికి పోయింది. దీంతో అసెంబ్లీని రేపటికి వాయిదా వేసింది. ఇదిలావుండగా కందమాల్ జిల్లాలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
|