కర్ణాటక రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. ఇప్పటికే బొటాబొటి ఆధిక్యంతో కర్ణాటకలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలో ఉన్న అసంతృప్తి ఒక్కసారి భగ్గుమంది. సొంత పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 'ఆపరేషన్ కమల' పేరుతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేసి, సొంత పార్టీలో చేర్చుకునేందుకు కర్ణాటక కమలనాథులు వ్యూహం రచించారు.
అలా కప్పదాటుకు పాల్పడిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టారు. ఇది సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం రుచించలేదు. భాజపా ఎమ్మెల్యే రేణుకా చార్య నాయకత్వంలో అప్పచ్చురంజన్, సొగడు శివణ్ణ, హరీష్, యం.విరుపాక్షప్ప, అప్పుపట్టణ్ణ శెట్టి, బేళూరు గోపాలకృష్ణలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏకంగా తమ సభ్యత్వాలకు బుధవారం రాజీనామా చేసి, స్పీకర్ జగదీష్ శెట్టర్కు సమర్పించారు.
ఈ వ్యవహారాన్ని స్పీకర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఖంగుతిన్నారు. సభ్యులకు తాను నచ్చజెపుతానని, రాజీనామాలను ఆమోదించవద్దని ముఖ్యమంత్రి కోరడంతో వాటిని పెండింగ్లో ప్టెటారు. దీనిపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందిస్తూ.. బీజేపీలో ఎలాంటి సంక్షోభం తలెత్తలేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు.
ఇదిలావుండగా.. జనతాదళ్ (ఎస్) నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఉమేష్ కత్తి బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పార్టీలోని అసంతృప్తి ఒక్కసారి బయటపడింది. దక్షిణ భారత రాష్ట్రంలో కమలనాథులు ఏర్పాటు చేసిన తొలి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక కావడం గమనార్హం.
|