సింగూర్ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించినట్టు రాజ్భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా యాజమాన్యం సింగూర్లో తలపెట్టిన నానో కార్ల ప్రాజెక్టుపై చెలరేగిన వివాదాన్ని పరిష్కరించేందుకు గాను గవర్నర్ మధ్యవర్తిత్వం వహించాలని బెంగాల్ ప్రభుత్వం కోరిన విషయం తెల్సిందే. దీంతో గవర్నర్ గాంధీ రంగంలోకి దిగారు.
ఇందులోభాగంగా ఆయన తొలుత బెంగాల్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి నిరుపమ్ సేన్, పంచాయతీరాజ్ మంత్రి సూర్జ్యకంఠ మిశ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమిత్ కిరణ్ దేబ్ తదితరులతో గురువారం రాత్రి చర్చలు జరిపారు. అనంతరం ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆయన సమావేశమై, సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొన్నట్టు సమాచారం. రాష్ట్రం నుంచి నానో కార్ల ప్రాజెక్టు చేజారి పోకుండా అన్ని రకాల తుది దఫా చర్యలు చేపడుతున్నారు.
ఇదిలావుండగా నానో కార్ల ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా సరికొత్త వ్యూహరచన చేశారు. వ్యవసాయ భూములతో పాటు నానో ప్రాజెక్టుకు భూములను అందజేసిన రైతులందరికీ ఈ ప్రత్యేక ప్యాకేజీని వర్తింపజేయాలని నిర్ణయించారు. దీనికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
|