ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధిలకు మద్రాస్ విశ్వవిద్యాలయం శుక్రవారం గౌరవ డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేసింది. మద్రాస్ యూనివర్శిటీని స్థాపించి 150 ఏళ్లు గడిచిన సందర్భంగా జరిగిన వార్షికోత్సవంలో ఈ ముగ్గురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కాన్వొకేషన్లో ప్రధాని మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మద్రాస్ యూనివర్శిటీని విశిష్టమైన సంస్థగా కొనియాడారు. సి.వి. రామన్, ఎస్. చంద్రశేఖర్ వంటి నోబుల్ అవార్డు గ్రహీతలతో పాటు పలువురు విశిష్ట వ్యక్తులను ఈ విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని ప్రధాని గుర్తు చేశారు.
మీరు 1930లో సి.వి రామన్, 1983లో ఎస్.ఆర్ చంద్రశేఖర్ వంటి నోబెల్ గ్రహీతలను, గణిత శాస్త్ర చరిత్రలో నోబెల్తో సమానమైన ఎబెల్ ప్రైజ్ విజేత ఎస్ఆర్ శ్రీనివాసన్ వంటి ఉద్దండులను తయారు చేశారని ప్రధాని పేర్కొన్నారు.
ఈ విశ్వ విద్యాలయంలో చదివిన మీ ప్యాకల్టీలు మరియు విద్యార్థులు వందలాది మంది తమ తమ రంగాల్లో జాతీయంగా, అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలు సాధించారని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రత్యేక కాన్వొకేషన్ సభలో ప్రధాని ప్రసంగించారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే అయినందున దేశంలోని టీచర్లకు ప్రధాని అభినందనలు తెలియజేశారు.
ఈరోజు దేశవ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకుంటున్నామని ప్రధాని తెలిపారు. ఈ యూనివర్శిటీ ప్రసాదించిన మేటి విద్యార్థి, టీచర్ మరియు మాజీ భారత రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా మన టీచర్లను ఈ రోజు మనం గౌరవించుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు.
ఈ యూనివర్సిటీలో వృత్తి జీవితం ప్రారంభించిన టీచర్గా, ఈ ప్రత్యేక సందర్భంలో మీ మధ్య ఉన్నందుకు మరింత గర్విస్తున్నానని ప్రధాని చెప్పారు. అనేక రకాలుగా ఈ యూనివర్శిటీ విశిష్టమైనదని, దేశంలోని గొప్ప జాతీయ సంస్థల్లో ఇది ఒకటని ప్రశంసించారు. అనేకమంది గొప్ప వ్యక్తులను మద్రాస్ విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని మన్మోహన్ చెప్పారు.
1857లో బ్రిటిష్ వారిచే స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్శిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, మైసూర్ విశ్వవిద్యాలయం మరియు కేరళ విశ్వవిద్యాలయం వంటి మేటి వర్శిటీల రూపకల్పనకు మార్గం సుగమం చేసిందని ప్రధాని కొనియాడారు.
|