వచ్చే లోక్సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాయి. ఇందులోభాగంగా జనతాదళ్ (ఎస్) అభ్యర్థుల జాబితాలో నిమగ్నమైంది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత ఎన్.చెలువరాయస్వామి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం తమ పార్టీ త్వరలోనే పది మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో జరుగనున్న ఏడు అసెంబ్లీ సీట్ల కోసమే కాకుండా లోక్సభ ఎన్నికలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. లోక్సభకు పోటీ చేసే పది మంది అభ్యర్థుల పేర్లను కూడా ఇప్పటికే ఖరారు చేశామని ఈ జాబితాను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు.
ఈనెల తొమ్మిదో తేదీతో భాజపా ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తమ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చెపడుతుందన్నారు. గత ఎన్నికల్లో భాజపా ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను లేవనెత్తుతామని చెప్పారు. నెరవేర్చని హామీలను ప్రధాన అస్త్రంగా చేసుకుని ఈ ప్రచారం సాగుతుందన్నారు.
|