బీహార్లో సాగుతున్న వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖామంత్రి, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఢిల్లీకి చేరుకుని ప్రధాని మన్మోహన్తో సమావేశమయ్యారు.
పిమ్మట మీడియాతో మాట్లాడుతూ.. బీహార్లో సాగుతున్న వరద సహాయక, పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తక్షణం మంత్రుల సమావేశం నిర్వహించాలని ప్రధాని మన్మోహన్ సింగ్కు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా సహాయ చర్యలపై ప్రతి మూడు నాలుగు గంటలకొకసారి సమీక్షా సమావేశం నిర్వహించేలా సంబంధిత అధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలన్నీ పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న వరద సహాయక చర్యలపై మంత్రి లాలూ ప్రధానికి ఒక లేఖను సమర్పించారు. వరద ముంపు ప్రాంతాల నుంచి రక్షించిన బాధితులను సహాయక శిబిరాలకు తరలించారని, ఇలాంటి వారంతా ఆకలితో అలమటిస్తూ.. వ్యాధుల బారినపడివున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం, జాతీయ విపత్తుల సహాయక అధికారుల మధ్య సమన్వయ లోపం పూర్తిగా లోపించిందన్నారు. అలాగే వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్జీవో, ఇతర రాజకీయ పార్టీలకు కూడా ప్రభుత్వం తగిన విధంగా సహకరించడం లేదని లాలూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఆహారధాన్యాలను కూడా బాధితులకు చేరవేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు.
|