ఎట్టకేలకు 'గాంధీ గిరి' ఫలితాన్నిచ్చింది. దేశ చిత్రపటంపై మాయని మచ్చగా మారిన సింగూర్ వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. రెండేళ్ళ తర్వాత నానో 'కారు' మబ్బులు వీడాయి. సమస్య పరిష్కానికి ఆ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ నెరపిన మధ్యవర్తిత్వం సఫలీకృతమైంది. రెండు వర్గాల ప్రతినిధులతో మూడు రోజుల పాటు సాగిన చర్చలు ఆదివారం రాత్రికి ఒక కొలిక్కి వచ్చాయి.
గవర్నర్ గాంధీ సమక్షంలో బుద్ధదేవ్ భట్టాచార్య, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీలు ముఖాముఖీగా సమావేశమయ్యారు. వివాదానికి ముగింపుగా ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయంటూ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ చర్చల వివరాలను రాజ్భవన్లో ప్రకటించారు. అలాగే సింగూరు వద్ద పదిహేను రోజులుగా చేస్తున్న ఆందోళనను తృణమూల్ కాంగ్రెస్ విరమించుకుంది.
ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. తగిన పరిహారం పొందని రైతులందరికీ ప్రభుత్వం తిరిగి భూమిని అప్పగిస్తుందని గవర్నర్ తెలిపారు. అనంతరం ఏకాభిప్రాయంపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఇది తమ పార్టీకి లభించిన సంపూర్ణ విజయం. సింగూరు అంశంపై రెండేళ్లుగా సాగించిన సుదీర్ఘ పోరాటానికి స్వస్తి చెబుతున్నట్టు ఆనందంగా ప్రకటించారు.
ఇదిలావుండగా సింగూర్ వ్యవహారంపై ఇప్పటి వరకు పెదవి విప్పని సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ తొలిసారి ఢిల్లీలో స్పందించారు. బెంగాల్ రాష్ట్రంలో టాటా కార్ల ఫ్యాక్టరీ స్థాపించాల్సిందేనని ప్రకటించారు. అయితే సీపీఐ నేత రాజా మాత్రం.. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదో గుణపాఠంలాంటిదని వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు, ఇతర అవసరాల నిమిత్తం భూముల సేకరణ చేపట్టే సమయంలో పార్టీలు, ప్రజల మనోభావాలను పరిగణంలోకి తీసుకోవాలని సూచించారు.
|