టాటా యాజమాన్యాన్ని బయటకు పంపాలనే ఉద్దేశం తమకు లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆమె నాయకత్వంలో సింగూర్ వరకు ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సింగూర్లో మాట్లాడుతూ సింగూర్ నుంచి టాటాలను వెళ్ళగొట్టాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. అయితే... వారి గురించి తాము చింతించడం లేదన్నారు.
టాటా తలపెట్టిన నానో కార్ల ప్రధాన ప్రాజెక్టును 600 ఎకరాల్లోనూ, దాని అనుబంధ యూనిట్లను 100 ఎకరాల్లో నిర్మించాలని చూసించారు. అంతేకాకుండా గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సమక్షంలో కుదిరిన జంటిల్మెన్ ఒప్పందాన్ని తుచ తప్పకుండా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పాటించాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి ఈనెల 19వ తేదీన రాష్ట్రానికి రానున్న గవర్నర్ గాంధీ కోసం తాము ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
ఆయనతో చర్చించిన పిదప తమ భవిష్యత్ ప్రణాళిక, తమ ఆందోళనను కొనసాగించాలా? లేదా అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగూర్లో తాము చేపట్టిన నిరవధిక ధర్నాను పూర్తిగా విరమించుకోలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామనే విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం గుర్తించుకోవాలని మమతా సూచించారు. నానో కార్ల ప్రాజెక్టు కోసం గత ఏడాది సింగూర్ రైతుల నుంచి వెయ్యి ఎకరాలను బెంగాల్ ప్రభుత్వం సేకరించింది. అప్పటి నుంచి సింగూర్ సమస్య ఆరంభమైంది.
|