భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరింది. ఇరు దేశాధినేతల సంతకాల కోసం ఈ ఒప్పందం సిద్ధంగా ఉన్నట్టు భారత్లోని అమెరికా రాయబారి జోరోమ్ బోన్ఫోర్డ్ వెల్లడించారు. దీనిపై ఆయన దేశ రాజధానిలో విలేకరులతో మాట్లాడుతూ భారత్-అమెరికా అణు ఒప్పందం తరహాలోనే ఈ ఒప్పందం ఉంటుందన్నారు. ఇప్పటికే ఒప్పందం పూర్తి పాఠం తయారై, సంతకాలకు సిద్ధంగా ఉందన్నారు.
గత జనవరి నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు నిఖోలస్ సర్కోజీ భారత్కు వచ్చినపుడే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య కుదిరినట్టు చెప్పారు. ఈనెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లే ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్తో సమావేశమైన తర్వాత ఇండో-యూఎస్ ఒప్పందాన్ని అమలుకు తెచ్చే 123 చట్టంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేసే అవకాశం ఉంది.
ఈ పర్యటన ముగించుకున్న తర్వాత ప్రధాని మన్మోహన్ అక్కడ నుంచి ఫ్రాన్స్ పర్యటనకు వెళతారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు సర్కోజీతో చర్చలు జరిపి, భారత్-ఫ్రాన్స్ అణు ఒప్పందంపై సంతకాలు చేస్తారని వివరించారు. భారత్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని పదేళ్ల క్రితమే ఫ్రాన్స్ నిర్ణయించిందన్నారు.
అణు శక్తితో పాటు అణు ఆయుధ సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. అణు సరఫరా గ్రూపు సభ్య దేశాలకు భారత్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఒప్పందం కార్యరూపం దాల్చవచ్చని ఫ్రాన్స్ రాయబారి స్పష్టం చేశారు.
|