అణ్వస్త్ర పరీక్షలపై భారత్ పాటిస్తున్న స్వచ్ఛంద అణు మారటోరియంను కొనసాగిస్తామని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరోమారు స్పష్టం చేశారు. అదే సమయంలో ఇందుకోసం ఏ విధమైన అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయబోమని ఆయన నొక్కివక్కాణించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
భారత్-అమెరికా అణు ఒప్పందంపై సంతకాల ప్రక్రియ పూర్తయ్యాక అణు పరీక్షలు నిర్వహించే విషయంపై భారత్కు గల అవకాశాలు ఏమిటని పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే హక్కు భారత్కు ఎప్పటికీ కోల్పోదని గుర్తు చేశారు. దేశ భద్రత అవసరాల నిమిత్తం అణు పరీక్షలు నిర్వహించాల్సి వస్తే వాటిని నిర్వహించి తీరుతామని ఆయన వెల్లడించారు.
వీటిపై స్పందించే హక్కు ఇతరులకూ ఉందన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఫోఖ్రాన్ వద్ద అణు పరీక్షలను 1998 సంవత్సరంలో నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత స్వచ్ఛందంగా మారటోరియంను విధించుకున్నట్టు, దీనిని ఇకముందు కూడా కొనసాగిస్తామని ప్రణబ్ తెలిపారు. |