భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు శనివారం సంతకాలు చేయనున్నారు. ఇందుకోసం అమెరికా విదేశాంగ మంత్రి కండోలినా రైజ్ దేశ రాజధానికి రానున్నారు. ఇరుదేశాల మధ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అణు ఒప్పందానికి అమెరికా ఎగువ, దిగువ సభలు ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సంతకాల ప్రక్రియ పూర్తయితే ఒప్పందం అమలుకు వస్తుంది. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం కేంద్రంలోని అధికార యూపీఏ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం శనివారాన్ని బ్లాక్డేగా పాటించాలని పిలుపునిచ్చాయి. ఈ చారిత్రత్మక ఘట్టంపై యూపీఏ వర్గాలు స్పందిస్తూ.. ఎన్నో ప్రయాసలకోర్చి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఈ ఒప్పందం వల్ల దేశానికి ఇంధన భద్రత లభిస్తుందని పేర్కొన్నాయి. అయితే విపక్షాలు మాత్రం.. దేశ సార్వభౌమత్వాన్ని యూపీఏ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, దీనివల్ల భవిష్యత్లో అణు పరీక్షలు నిర్వహించే హక్కును దేశం కోల్పోతుందని మండిపడ్డాయి. |
| సంబంధిత సమాచారం కోసం శోధించండి. |
|