దేశ వాణిజ్య రాజధానిలో పేలుళ్ళకు కుట్ర పన్నిన 15 మంది ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వీరికి ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూరుల్లో జరిగిన వరుస పేలుళ్ళతో సంబంధం ఉన్నట్టు వెల్లడైంది. నవరాత్రి ఉత్సావాల సమయంలో ముంబైలో విధ్వంసం సృష్టించేందుకు వీరు కుట్ర పన్నినట్టు వెల్లడైంది.
అరెస్టు చేసిన వారని గత నెల 28వ తేదీ నుంచి అక్టోబరు ఐదో తేదీల మధ్య అరెస్టు చేసినట్టు ముంబై జాయింట్ పోలీసు జాయింట్ కమిషనర్ రాకేష్ మారియా వెల్లడించారు. వీరిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. నవరాత్రి సంబరాలను పురస్కరించుకుని పేలుళ్లు నిర్వహించేందుకు కుట్ర పన్నారని ముంబై పోలీసు కమిషనర్ హాసన్ గఫూర్ తెలిపారు.
ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన వీరంతా వైర్లెస్ ఇంటర్నెట్ సౌకర్యంతో సమాచారాన్ని చేరవేసుకుంటూ పేలుళ్ళకు పాల్పడుతున్నట్టు వివరించారు. సమాచారాన్ని చేరవేస్తున్న మీడియా బృందంలో మాన్సూర్ అస్గర్ పీర్భాయ్, మోబిన్ ఖాదర్ షేక్, అసిఫ్ బష్రుద్దీన్ షేక్ తదితరులు ఉన్నారు.
ప్రస్తుతం అరెస్టు చేసిన వారిలో పది మంది తీవ్రవాదులు బాంబులు తయారు చేసి, వాటిని సూరత్లో భద్రపరిచినట్టు వెల్లడించారు. తక్కువ సామర్థ్యం కలిగిన రెండు డజన్ల బాంబులను సూరత్లో స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. |