పశ్చమ బెంగాల్ సింగూర్ నుంచి నానో వెళ్లి పోయినా దాని ద్వారా తలెత్తిన వివాదం మాత్రం అప్పుడే సమసిపోయే సూచనలు కన్పించడం లేదు. పారిశ్రామికీకరణ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కృషికి ఆ రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలంటూ రతన్ టాటా తాజాగా చేసిన వ్యాఖ్యలు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కోపం తెప్పించాయి.
రతన్ టాటా చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు మమతా బెనర్జీ పేర్కొన్నారు. పారిశ్రామిక విధానంలో తమ విధానాన్ని తప్పుపడుతూ రతన్ టాటా పశ్చిమ బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం.
కోల్కతాలో ఆదివారం ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు టాటా రాసిన ఈ బహిరంగ లేఖను తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన లేఖ రాసినందుకు రతన్ టాటాపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తాము యోచిస్తున్నామని మమత పేర్కొన్నారు. |