అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి కుదేలవుతున్న వాణిజ్య రంగాలను ఆదుకునేందుకు వీలుగా స్వదేశీ వస్తువులపై వసూలు చేసే పన్నుల (ఎక్సైజ్ సుంకాలు)ను తగ్గిస్తామని కేంద్ర విత్తమంత్రి పి.చిదంబరం తెలిపారు. అలాగే ఆయా రంగాలు కూడా పెంచిన ధరలను వీలైనంత మేరకు తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచ ఆర్థిక ఫోరం, భారత పరిశ్రమల సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి చిదంబరం పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక మాంద్యానికి అతలాకుతలం అవుతున్న రంగాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులోభాగంగా.. ఆటోమొబైల్, తయారీ, ఉత్పత్తి, రియాల్టీ, ఎయిర్లైన్ సంబంధిత వస్తువులు, సేవల ధరలను తగ్గించాలని ఆయన కోరారు. అలాగే నక్షత్ర హోటళ్ల టారిఫ్లు, విమానయాన ధరలు, రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్ అమ్మకాలు, గృహాల ధరలతో పాటు నిత్యావసర సరకుల ధరలను తగ్గించాలని ఆయన సూచించారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో దేశం సంతృప్తికరమైన అభివృద్ధి రేటును సాధించగలదనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో కూడా పెరుగుదల కనిపించగలదని మంత్రి చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. |