ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆ రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తోన్న నిధులను పక్కదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు చేసిందో వివరించాల్సిందిగా మంత్రులను నిలదీయండి అంటూ ఈ సందర్భంగా ప్రజలకు సోనియా పిలుపునిచ్చారు.
ఛత్తీస్గఢ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని సోనియా మంగళవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా రాయ్గఢ్ జిల్లాలోని ఖరాసియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో సోనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార బీజేపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఓట్లు చాలా ముఖ్యమైనవని అంతటి విలువైన ఓట్లను ప్రజలు విద్వేషీ రాజకీయాలకు పాల్పడే బీజేపీకి వేస్తారో, అభివృద్ధికి మారుపేరైన కాంగ్రెస్కు వేస్తారో మీ ఇష్టమేనంటూ ఆమె ఓటర్లను కోరారు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకం ఛత్తీస్గఢ్లో విఫలం కావడానికి బీజేపీనే కారణం అని ఆమె విమర్శించారు. |