వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెడితే పార్లమెంట్ దాడి కేసులో ముద్దాయిగా తేలిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. దీనిపై ఆ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి వీకె.మల్హోత్రా మంగళవారం భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అఫ్జల్ గురుకు ఉరిశిక్షను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు జాప్యం చేయడాన్ని మల్హోత్ర తప్పుపట్టారు. అఫ్జల్ గురు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటీషన్పై రాష్ట్రపతి తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారని, అయితే ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రభుత్వం మాత్రం ఆ శిక్షను అమలు చేయడంలో గత రెండేళ్ళుగా విఫలమైందని ఆరోపించారు. గురుకు శిక్షను అమలు చేయలేమని షీలా దీక్షిత్ స్పష్టం చేసినట్టయితే.. తాము కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఒక్క సెకను కాలంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆమె మాత్రం సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం అఫ్జల్ గురుకు శిక్షను అమలు చేసి తీరుతామన్నారు. మొత్తం 70 సీట్లు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో భాజపా తన మిత్రపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. ఈనెల 29వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబరు ఎనిమిదో తేదీన జరుగుతుంది. |