ఆర్ఎస్ఎస్, బజరంగదళ్ సంస్థలపై నిషేధం విధించే ఉద్ధేశ్యమేదీ తమకు లేదని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అందువల్ల ఆయా సంస్థల్లో సభ్యులుగా ఉన్నవారు బ్రిటన్లో పర్యటించేందుకు ఎలాంటి నిరోధం ఉండబోదని బ్రిటన్ స్పష్టం చేసింది.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనను వ్యతిరేకిస్తూ కొద్ది నెలల క్రితం అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందిన ఓ ముఖ్య నేత బ్రిటన్లో పర్యటించి అక్కడి హిందూ నేతలతో సమవేశమయ్యారు.
ఈ అంశం బ్రిటన్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ విషయమై బ్రిటన్లో ఓ మాజీ మంత్రి సభలో ప్రశ్న లేవనెత్తారు. దీంతో ఈ విషయమై బ్రిటన్ విదేశాంగ శాఖ సహాయమంత్రి లార్డ్ మలోక్ బ్రౌన్ సభలో ఓ ప్రకటన చేశారు.
బ్రిటన్ తీవ్రవాద చట్టం -2000 ప్రకారం ఆర్ఎస్ఎస్, బజరంగదళ్ సంస్థలపై నిషేధం విధించే కారణాలేవీ లేవని బ్రౌన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేసమయంలో ఓ సంస్థలో సభ్యత్వం ఆధారంగా ఓ వ్యక్తిని బ్రిటన్లో పర్యటించకుండా నిషేధించబోమని కూడా ఆయన ప్రకటించారు.
ఇటీవల భారత్లో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించడం అదేసమయంలో కొన్ని సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో హిందూమత సంస్థల ప్రమేయం కూడా ఉందని ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. దీంతో దేశంలోని హిందూమత సంస్థలైన ఆర్ఎస్ఎస్, బజరంగదళ్లను నిషేధించాలనే అంశం తెరమీదకొచ్చింది. ఇలాంటి తరుణంలో బ్రిటన్ చేసిన ప్రకటన ఆయా సంస్థల నేతలకు ఊతమిచ్చేదిగా ఉండగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. |