అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ మహ్మద్ ఎల్ బరాదే ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఇటీవల సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ దేశాలు తమ అణు ఇంధన సామర్థ్యాన్ని సైనిక అవసరాలకు కాకుండా శాంతి ప్రయోజనాలకోసం ఉపయోగించాలని కోరుతూ బరాదే చాలా ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఈ బహుమతిని ప్రకటిస్తున్నట్టు జ్యూరీ పేర్కొంది. అలాగే అణు విస్తరణ, అంతర్జాతీయ భద్రతా అంశాలపై బరాదే దాపరికం లేకుండా మాటలాడుతారని ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ తన ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం మూడవసారి ఐఏఈఏ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బరాదే వృత్తిరీత్యా న్యాయవాది కావడం విశేషం. ప్రారంభంలో ఆయన 1964లో ఈజిప్టు దౌత్య సర్వీసులో తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం న్యూయార్క్, జెనీవాలలోని ఐక్యరాజ్యసమితిలో సేవలందించారు. గత 1997 నుంచి ఐఏఈఏలో ఆయన డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. |