దేశ భద్రతపై ఇంటలిజెన్స్ బ్యూరో ఈనెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఇందులో 28 రాష్ట్రాలకు చెందిన డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లతో పాటు ఇంటలిజెన్స్ బ్యూరో విభాగానికి చెందిన 35 మంది జాయింట్ డైరక్టర్లు కూడా హాజరుకానున్నారు. దేశ రాజధానిలో వచ్చే 22, 23 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుంది.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ సమావేశానికి హాజరై, దేశ భద్రతపై ఉన్నతాధికారులతో చర్చిస్తారు. కాగా, ఈ సమావేశాన్ని కేంద్ర హోం శాఖామంత్రి శివరాజ్ పాటిల్ ప్రారంభిస్తారు. జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణ్తో పాటు హోం శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు.
ఈ సమావేశంలో ఆర్మీ, పోలీసు రంగాలకు చెందిన హిందూ సిద్ధాంతవాదుల చొరబాట్లను అరికట్టడంపై ఇందులో కీలకంగా చర్చిస్తారు. అంతేకాకుండా కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో క్రైస్తవ సంస్థలపై దాడులకు పాల్పడిన భజరంగ్దళ్పై నిషేధం విధించే అంశాన్ని కూడా ఈ ఉన్నతస్థాయి సమావేశంలో చర్చిస్తారు. |