మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైందని దుయ్యబట్టారు. తన ఎన్నికల పర్యటనలో భాగంగా స్థానిక సోకాల్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ఐదేళ్ళ పాలనపై విమర్శలు గుప్పించారు.
శివరాజ్ సింగ్ పాలనలో మహిళలకు భద్రత కురువైందని, విద్యుత్ సంక్షోభ కోరల్లో చిక్కుకుందని, రోడ్డు అధ్వాన్నంగా ఉన్నాయని దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో మొత్తంగా అభివృద్ధి కుంటుపడిందని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, రాహుల్ సుడిగాలి పర్యటనలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఒక్కసారి వేడెక్కింది.
కాంగ్రెస్ తరపున యువనేత రాహుల్ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టిన విషయం తెల్సిందే. దీంతో రాహుల్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. బిజెపి ఐదేళ్ళ పాలనపై నిప్పులు కురిపిస్తూ, కేంద్రంలో కాంగ్రెస్ చేపట్టిన పథకాలను వివరిస్తున్న తీరుకు యువతలో మంచి స్పందన వచ్చేలా ఆకట్టుకున్నారు. |