తాను ప్రధాని కావాలని నెత్తిన రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అదేసమయంలో ప్రధాని కావాలనే ఆశ తనలోనూ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ వేదికగా హిందూస్థాన్ టైమ్స్ పత్రిక శుక్రవారం నిర్వహించిన సదస్సులో లాలూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పదవిపై తాను ఆశ పడడంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో సైతం బీజేపీకి అధికారం కల్లేనని జోస్యం చెప్పారు.
ఆ పార్టీ నుంచి తప్ప మరేదేని కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తన పదవీకాలంలో రైల్వేలు రూ. లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరే సూచనలు కన్పించడం లేదని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభమే అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. |