మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 1969లో తీసుకున్న కీలక నిర్ణయం వల్లే ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవతంగా ఎదుర్కోగలుగుతున్నామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. హిందుస్థాన్ టైమ్స్ శుక్రవారం దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. 1969లో దేశంలోని బ్యాంకులన్నింటినీ జాతీయం చేయడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంక్షోభ ప్రభావం మనపై పెద్దగా చూపలేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచి పేదలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె నొక్కివక్కాణించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ధనవంతుల దురాశ నుంచి పేదలను రక్షించడం తక్షణావసరమని ఉద్ఘాటించారు. అదేసమయంలో ఆర్థిక సరళీకరణ విషయంలో ఆచితూచి అడుగులేయాల్సిన అవసరాన్నీ ఆమె నొక్కి చెప్పారు. స్వేచ్ఛా సమాజంగా మనం అభివృద్ధి పథంలో సాగేటప్పుడు సామాజిక న్యాయాన్ని పణంగా పెట్టకుండా జాగ్రత్తపడాలన్నారు. ఆర్థిక సంక్షోభ దుష్ప్రభావాల నుంచి బలహీన వర్గాలను రక్షించాలని, బ్యాంకర్లు, వ్యాపారుల దురాశకు వారు బలిపశువులు కాకుండా చూడాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందని సోనియా అభిప్రాయపడ్డారు. |