దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ తన వంతు సాయం చేసినట్టు ఆర్మీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయం ఇంటలిజెన్స్ వర్గాలు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు వినికిడి. ఇందుకు తొలి సాక్ష్యం... ఉగ్రవాది వాడిన సిమ్ కార్డు పాకిస్థాన్ (కరాచీ)కు చెందినది కావడం. పేలుళ్ళకు ముందు ఐదు సార్లు, పేలుడు తర్వాత మూడు సార్లు కరాచీకి ఫోన్ చేసినట్టు అందులో తేలింది.
అంతేకాకుండా.. ఉగ్రవాదులు భారత్లో పర్యటించేందుకు తమ భూతల, సముద్ర మార్గాలను ఉపయోగించుకునేందుకు పాకిస్థాన్ అనుమతి ఇవ్వడమే కాకుండా.. కరుడుగట్టిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ముంబైకి బోటు ద్వారా చేరుకున్న ఉగ్రవాదులు పాకిస్థానీయులనే సంకేతాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల ద్వారా ఈ విషయం వెల్లడైందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై మాట్లాడేందుకు మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ఆర్.పాటిల్తో పాటు.. ఆర్మీ, ఎన్ఎస్జి అధికారులు నిరాకరించారు. మరోవైపు ముంబై తీరాన్ని చేరుకోవడానికి ఉగ్రవాదులు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న నాలుగు బోట్లను కొలాబా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. |