|
ముష్కరుల చెర నుంచి నక్షత్ర హోటల్ తాజ్ను, అందులోని అతిథులను రక్షించేందుకు జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జి), మెరైన్ కమెండోలు చేపట్టిన ఆపరేషన్ సైక్లోన్ విజయవంతంగా పూర్తయింది. హోటల్లో బీభత్సం సృష్టించిన ముగ్గురు తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అందులోని బందీలను రక్షించి, హోటల్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
దీంతో 59 గంటల పాటు సాగిన ఆపరేషన్ ముగిసింది. అయితే.. హోటల్లోని ప్రతి ప్రాంతాన్ని, గదులను నిశితంగా తనిఖీ చేస్తున్నారు. హోటల్లోకి టాటా గ్రూపు యాజమాన్యాన్ని భద్రతా బలగాలు అనుమతించాయి. అలాగే మీడియాను కూడా మరింత ముందుకు వచ్చి కవరేజీ చేసుకునేలా పోలీలుసు అంగీకరించారు.
పోలీసుల అనుమతితో టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా హోటల్కు చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై ఎన్ఎస్జి డైరక్టర్ జనరల్ జేకె.దత్ మాట్లాడుతూ... తాజ్ ఆపరేషన్ దాదాపుగా పూర్తయింది. అయితే హోటల్లోని ప్రతి మూలను నిశితంగా పూర్తి చేసిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
హోటల్లో నక్కిన ఉగ్రవాదులందరినీ హతం చేసినట్టు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ముగ్గురు తీవ్రవాదులను కమెండోలు హతమార్చినట్టు చెప్పారు. అతిథులెవ్వరూ లోపల లేరని వెల్లడించారు. అయితే.. హోటల్ నుంచి ఎంతమందిని రక్షించింది మాత్రం ఖచ్చితంగా వెల్లడించలేమన్నారు. ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆనయ తెలిపారు.
|