ముంబై ఘాతుకం తర్వాత కేంద్ర హోమంత్రి శివరాజ్ పాటిల్ ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముంబై మారణహోమం అనంతరం కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి (సీడబ్ల్యూసి) శనివారం అత్యవసరంగా సమావేశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు.. వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముంబై పేలుళ్ళకు కేంద్ర నిఘా లోపమేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా కేంద్ర హోం శాఖా మంత్రి శివరాజ్ పాటిల్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో పాటు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా సమావేశానికి హజరైన పలువురు సభ్యులు కూడా హోమంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో ఆయన రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలావుండగా.. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఆదివారం జరుగనుంది. ఈ సమావేశంలో కూడా కేంద్రం హోం శాఖ నిఘా వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన పక్షంలో ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా దేశంలో పలు బాంబు పేలుళ్ళు చోటు చేసుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ హోం మంత్రి పాటిల్కు మద్దతుగా ఉంటూ వచ్చింది. అయితే ముంబై ఘాతుకంలో మాత్రం వెనుకేసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సాహసం చేయలేదు. దీంతో పాటిల్కు పదవీగండం వీడేలా లేదు. |