ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన ఘాతుకం దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే ఈ పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ.. కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. అదేకోవలో జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణన్ కూడా తన రాజీనామా చేశారు. అయితే.. ప్రధానమంత్రి మాత్రం నారాయణన్ రాజీనామాను ఆమోదించ కుండా పదవిలో కొనసాగాల్సిందిగా కోరారు. దీంతో ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.
ముంబై పేలుళ్ళలో కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో హోం శాఖ మంత్రి తప్పుకోగా, తాజాగా జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకునేందుకు నిర్ణయించి, రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి చేరవేరశారు. దీనికి ప్రధాని ఆమోదముద్ర వేయలేదు. అంతకుముందు.. మంత్రి పాటిల్ చేసిన రాజీనామాను ప్రధాని ఆమోదించగా, అలాగే రాష్ట్రపతి కూడా సమ్మతం తెలిపారు. ఆయన స్థానంలో హోంమంత్రిగా పి.చిదంబరంను నియమించిన విషయం తెల్సిందే. |