|
ముంబైలో ఉగ్రవాదుల దాడి ఫలితంగా రాజకీయ పీఠాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఇప్పటికే.. పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాజాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్, ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ తమ పదవులకు రాజీనామా చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేశ్ముఖ్ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. అలాగే ముంబాయి పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ అంతరాత్మ ప్రబోధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం ఆర్.ఆర్.పాటిల్ తెలిపారు. తన రాజీనామ లేఖను ఎన్.సి.పి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్కు పంపినట్లు వెల్లడించారు.
అంతేకాకుండా.. జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె.నారాయణన్ కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ప్రధాని మన్మోహన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా.. పేలుళ్ళ అనంతరం ముఖ్యమంత్రి దేశ్ముఖ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
దీనికి తోడు బాలీవుడ్ దర్శకుడు రామ్గోపాల్ వర్మతో కలిసి తాజ్ హోటల్ సందర్శనకు వెల్లడంపై విమపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచి కూడా ఒత్తిడి రావడంతో రాజీనామా చేయక తప్పలేదు.
|