రెండు రోజుల క్రితమే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్ రాజీనామా లేఖను సమర్పించారని ఎన్.సి.పి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ వెల్లడించారు. ముంబై మారణహోమానికి నైతిక బాధ్యత వహిస్తూ.. అంతరాత్మ ప్రబోధానికి లోబడి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆర్.ఆర్.పాటిల్ ప్రకటించిన విషయం తెల్సిందే. పాటిల్.. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా మహారాష్ట్ర హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ముంబైలో ఉగ్రవాదుల విధ్వంసం తర్వాత పాటిల్ చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఆయన పదవికి ఎసరుపెట్టాయి. ఇలాంటి దాడులు ముంబైలో కాకుండా దేశంలో ఎక్కడైనా జరుగుతాయని, 9/11 దాడుల కంటే.. ఇవి పెద్దవి కావని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ముంబై వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేశారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలా ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు పంపారు. దీనిపై పవార్ మీడియాతో మాట్లాడుతూ.. ముంబై పేలుళ్లు జరిగిన వెంటనే పాటిల్ రాజీనామా చేశారని, అయితే ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు ఆగాల్సిందిగా తాను కోరినట్టు చెప్పారు. అలాగే పాటిల్ రాజీనామాను ఆమోదించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరినట్టు శరద్ పవార్ వెల్లడించారు. |