బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ స్వల్పకాలిక సమావేశాల్లో ఉగ్రవాదం, ఆంతర్జాతీయ ఆర్థిక మాంద్యంపై చర్చలు తీవ్రంగా జరగనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ముంబై నగరంలో దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి రాజకీయ ఏకాభిప్రాయం సాధించడానికి ఈ పది రోజుల పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రయత్నాలు మొదలు కావచ్చని విశ్లేషకులు అంచనా.దేశంలో ఉగ్రవాద ఘటనలను నిరోధించేందుకు గాను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి ఈ సమావేశాలు దోహదం చేయవచ్చని విశ్లేషకుల భావన. ఇందుకు సంబంధించి నూతన హోం మంత్రి పి.చిదంబరం ఇప్పటికే ప్రతిపక్ష నేత ఎల్ కె అద్వానీని కలిసి సంప్రదించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంతో పాటు ఆర్థికాభివృద్ధి రేటును ఇప్పటికే 7.5 శాతానికి తగ్గించి వేసిన ఆర్థిక మందగమనంపై చర్యలు జరగవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్కు అనుకూల వాతావరణం ఏర్పడిన ఈ నేపథ్యంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ, ఉగ్రవాదం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష బిజేపీ కత్తులు నూరుతోంది. ఉగ్రవాదులతో వ్యహరించడంపై ప్రభుత్వ సన్నద్ధతపై సమగ్ర నివేదికను సమర్పించవలసిందిగా తాము ప్రభుత్వాన్ని కోరనున్నామని బిజేపీ నేత ముక్తర్ అబ్బాస్ నక్వి చెప్పారు. భద్రతకు సంబంధించి ప్రభుత్వం ప్రజలకు బాధ్యత పడాలని వ్యాఖ్యానించారు.సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి సమావేశం బహుశా ఇదే కావచ్చని విశ్లేషకుల భావన. రాబోయే సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశముందని ఓ అంచనా. |