గత సంవత్సరం చంద్రయాన్1 ప్రాజెక్టుతో యావత్ ప్రపంచం అభినందనలు అందుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రో- శాస్త్రజ్ఞులు ప్రస్తుతం మలి తరం అధునాతన రాకెట్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. భారీ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టేందుకు తోడ్పడే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3ని అభివృద్ధి చేయడానికి గాను ఇస్రో 2009లో వరుస పరీక్షలను నిర్వహించనుంది. ఇది 2010-11లో ప్రయోగానికి సిద్ధమవుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.ఇస్రో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ కొత్త రాకెట్ దాదాపు నాలుగు టన్నుల బరువు ఉండే ఉపగ్రహాలను సైతం రోదసీలోకి తీసుకుపోగలదు. దీనిద్వారా అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లో కారు చౌకగా ఉపగ్రహ ప్రయోగ రాకెట్లను తయారు చేసే అవకాశం ఇస్రోకు లభిస్తుంది.ఇప్పటివరకూ ఇస్రో రూపొందించిన సాధారమ జిఎస్ఎల్వి రాకెట్ 2.2 టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే రోదసిలోకి మోసుకుపోతోంది. నూతన సంవత్సరంలో తాము మార్క్3 ప్రయోగం కోసం ఘన రూప బూస్టర్ టెస్టింగ్ జరుపుతామని, తర్వాత ద్రవ రూప బూస్టర్ ప్రయోగం ప్రారంభించి, అంతిమంగా క్రయోజనిక్ ఇంజన్ దశకు చేరగలమని విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ కె. రాధాకృష్ణన్ చెప్పారు. 2010-11 లో ఈ కొత్త తరం రాకెట్ ఫ్లైట్ టెస్ట్కు తాము పథక రచన చేస్తున్నామని రాధాకృష్ణన్ తెలిపారు. దీనితో ఒకే ఉపగ్రహంలో మరిన్ని ట్రాన్స్ప్లాండర్లను తీసుకుపోగల సామర్థ్యాన్ని ఇస్రో సంతరించుకుంటుందని తెలిపారు. నాలుగు టన్నుల ఉపగ్రహాలను ప్రారంభించడం ద్వారా ఉపగ్రహ ప్రయోగ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు.రెగ్యులర్ జిఎస్ఎల్వితో అంతరిక్షంలోకి మనుషులను కూడా పంపవచ్చని మార్క్ 3 దశను ఉపయోగించగలిగినట్లయితే ఇద్దరికి బదులుగా ముగ్గురు రోదసీ యాత్రికులను సైతం ఒకే ఉపగ్రహంలో పంపడానికి వీలవుతుందని చెప్పారు. |