నూతన సంవత్సరం ప్రారంభ దినం అస్సోం రాజధాని గౌహతిలో జరిగిన మూడు వరుస బాంబు పేలుళ్లలో ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం కనీసం 5 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. గౌహతిలో రద్దీగా ఉండే బిరుబారి, భూతనాథ్, బంగాగర్ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ వరుస పేలుళ్లుకు హోం మంత్రి పి చిదంబరం లక్ష్యమని తేలడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భూతనాథ్ ప్రాంతంలో సైకిల్ బాంబు పేలిన మార్గంలోనే హోంమంత్రి చిదంబరం కాన్వాయ్ బయలుదేరి వెళ్లిపోయింది. తర్వాత బిరుబారి ప్రాంతంలో చెత్త డబ్బాలో ఉంచిన బాంబు పేలింది. ఇక్కడి మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన డస్ట్ బిన్లో ఐఇడిని తీవ్రవాదులు గురువారం సాయంత్రం 3.30 గంటల మధ్య పేల్చారని అధికారులు చెప్పారు. ఈ డస్ట్ బిన్ స్థానిక టిబి హాస్పిటల్ సమీపంలో ఉండటం గమనార్హం. బంగాగర్లోని బిగ్ బజార్ వెలుపల మూడో పేలుడు సంభవించిందని అధికారులు తెలుపారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇది పేలి ఉంటుందని చెప్పారు. ఈ మొత్తం ఘటనల్లో మృతులు, గాయపడిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.తీవ్రవాద వ్యతిరేక కార్యాచరణను సమీక్షించేందుకు గాను కేంద్ర హోంమంత్రి పి చిదంబరం రెండు రోజుల పర్యటనకు గాను అస్సోం చేరుకున్న తరుణంలో ఈ వరుస పేలుళ్లు జరగడం సంచలనం కలిగించింది. ఈ వరుస పేలుళ్ళ వెనుక అల్ఫా తీవ్రవాదుల హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థకూడా ఈ పేలుళ్ళుకు బాధ్యతను ప్రకటించలేదు. గత అక్టోబర్ 30న అస్సోంలో జరిగిన వరుస పేలుళ్లకు 88 మంది బలైన విషయం తెలిసిందే. నూతన సంవత్సరం తొలి రోజునే జరిగిన ఈ దాడికి కారకులైన వారు సంఘటనా ప్రాంతంనుంచి తప్పించుకుపోయారని సమాచారం. |