కోల్కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాత పడ్డారు. మరో 29 మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్డర్పూర్ ప్రాంతంలోని హైడ్ రోడ్డులో ఆదివారం ఈ సంఘటన జరిగింది. కల్తీ సారా ఘటనలో మృతి చెందిన వారిలో 10 మంది మృతదేహాలను గుర్తించినట్టు మరో నలుగురిని గుర్తించాల్సి ఉందని కోల్కతా నగర పోలీసులు వెల్లడించారు.
దీనిపై జాయింట్ కమిషనర్ (పరిపాలన) పి.ఛటర్జీ మాట్లాడుతూ కల్తీ సారా సంఘటన వార్తలు వెలువడిన మరుక్షణమే ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారని చెప్పారు. శనివారం రాత్రి కల్తీ సారా తాగిన మద్యం బాబుల్లో కొందరు మృతి చెందినట్టు చెప్పారు. కాగా, పోస్టుమార్టం పూర్తయిన శవాలను ఆస్పత్రి నుంచి తొలగించి దహనం చేసినట్టు చెప్పారు.
పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. అలాగే కల్తీ సారా సేవించిన మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. వీరిని ఎస్ఎస్కెఎం, శంభునాథ్ పండింట్ ఆస్పత్రులకు తరలించినట్టు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ముగ్గురు మహిళలతో సహా ఏడుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ స్థలంలో కల్తీ సారా, నకిలీ లేబుల్స్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదిలావుండగా సంఘటనా ప్రాంతాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సందర్శించారు. దుర్ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం చేయాలని కోరారు. తమ పార్టీ తరపున రూ.పది వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. |