దేశవ్యాప్తంగా 60 లక్షల రవాణా ట్రక్కులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు ప్రారంభించినట్లుగా అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో దేశంలో ఆహార పదార్ధాల సంక్షోభం తలెత్తుతుందన్న భయంతో వర్తకులు, ప్రజలు దొరికింది దొరికినట్లుగా కొనివేయడం ప్రారంభించారు. సమ్మె మొదలై ఒక రోజైనా కాకముందే స్థానికంగా లభించే కూరగాయలు, పళ్ల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగిపోయాయి. దీంతో ఉత్తర భారతంలో చండీఘడ్, మొహాలీ, పంచకుల వంటి ప్రాంతాల్లో జనం సరుకుల కొనుగోళ్లకు పరుగులెత్తారు. ప్రత్యేకించి ఉల్లిపాయల షాపుల వద్ద జనం పెద్ద ఎత్తున క్యూ కట్టడం ప్రారంభించారు. దేశానికి అవసరమైన ఉల్లిపాయల్లో ఎక్కువ భాగం నాసిక్ నుంచే సరఫరా అవుతుండటంతో సమ్మె కొనసాగిన పక్షంలో ఉల్లిపాయల ధరలు చుక్కలంటుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.ఇప్పటికే రవాణా నిలిచిపోతుందన్న భయంతో కూరగాయలు, పళ్ల వర్తకులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి ఆర్డర్లను రద్దు చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ నుంచి సరఫరా అయ్యే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. బీన్స్, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, కీరకాయల ధరలు ఇప్పటికే 50 శాతం మేరకు పెరిగాయని వ్యాపారులు చెప్పారు.సోమవారం సమ్మె కారణంగా జాతీయ రహదారులు బోసిపోయి కనిపించాయి. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోగా, డ్రైవర్లు రోడ్లమీద పచార్లు చేయడం మొదలెట్టారు. చాలావరకు సరకులు దింపడం, ఎక్కించడం ఆగిపోయింది. అయితే తొలి 48 గంటల పాటు పెట్రోలు, డీజెల్, ఎల్పీజీ, పాల సరఫరాను సమ్మెనుంచి మినహాయిస్తున్నట్లు ట్ర్కక్కర్లు ప్రకటించారు. |