పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగిస్తోందని భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డారు. లష్కరే తోయిబా కార్యకర్తలు ముంబైలో జరిపిన ఘాతుక దాడులకు భారత్ పొరుగుదేశంలోని కొన్ని ప్రభుత్వ సంస్థల మద్దతు ఖాయంగా ఉందని ప్రధాని తేల్చి చెప్పారు.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దేశీయ అంతర్గత పరిస్థితిపై మంగళవారం జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ముంబై దాడుల వెనుక సైనిక సన్నద్ధత, ఖచ్చితమైన ప్రణాళికను పరిశీలిస్తే పాకిస్తాన్ అధికారిక సంస్థలు ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు ఖచ్చితంగా సహాయం చేశారని స్పష్టం చేశారు. భారత్లో ఉగ్రవాదాన్ని విదేశీయులు ప్రత్యేకించి పాకిస్తాన్ ప్రధానంగా ప్రోత్సహిస్తోందని ప్రధాని ముఖ్యమంత్రుల భేటీలో చెప్పారు. ముంబై దాడులలో లష్కరే పాత్రపై అమెరికా ఎఫ్బిఐతో సహా విదేశీ సంస్థలనుంచి సమాచారం సేకరించామని సింగ్ తెలిపారు. మరోవైపు స్వదేశంలో ఉగ్రవాదులను అదుపు చేయలేని పాక్ పదే పదే యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తోందని దుయ్యబట్టారు. పాక్ యుద్ధోన్మాదాన్ని పాక్ ప్రేరేపిస్తున్నప్పటికీ భారత్ ఒక్కత్రాటిమీద నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి సవాలుగా కనిపిస్తోంది కానీ, ఉగ్రవాదం అదుపు తప్పలేదని, అంతర్గాత, బాహ్య ప్రమాదాలను ఎదుర్కోవడానికి దృఢమైన జాతీయ తత్వం అవసరముందని ప్రధాని అభిప్రాయ పడ్డారు. నవంబర్ 26-29 తేదీలలో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో భద్రతా లోపాలు ఉన్నాయని ప్రధాని అంగీకరించారు. సముద్ర మార్గాన్ని ఉపయోగించుకున్న ఉగ్రవాదులు భూమార్గానికి బదులుగా సముద్ర మార్గాన్ని దాడులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మన నిఘాను వారు అధిగమించగలిగారని పేర్కొన్నారు. |