దేశంలో నానాటికి పెరిగిపోతున్న పబ్ సంస్కృతికి తాను కూడా వ్యతిరేకమని కేంద్ర ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖామంత్రి అన్బుమణి రాందాస్ అభిప్రాయపడ్డారు. ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప (భాజపా), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్)లు ప్రకటనలు చేసిన విషయం తెల్సిందే. ఈ జాబితాలోకి తాజాగా మంత్రి అన్బుమణి కూడా చేశారు. పబ్ల సంస్కృతి భారతీయ నైతిక జీవన విధానానికి విరుద్ధమని, ప్రతిపాదిత జాతీయ ఆల్కహాల్ విధానం దానికి అడ్డుకట్టవేయగలదని అన్నారు. అయితే పబ్లకు వెళ్లే మహిళలపై దాడులు చేయడాన్ని మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో దేశంలో పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతులకు అడ్డుకట్ట వేసి, హిందూ సంప్రదాయాన్ని కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో జరిగే ప్రమాదాల్లో 40 శాతం మేరకు మద్యం సేవించిన స్థితిలో వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయన్నారు. ఇలాంటి యువత తమ జీవితాలనే కాక రోడ్డు నడిచి వెళ్లే ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేవారిలో ఎక్కువ మంది 20 ఏళ్ల వయసు వారేననని విషయాన్ని మనం గ్రహించాల్సి ఉందన్నారు. దేశంలో గత ఐదారేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య 60 శాతం మేరకు పెరిగినట్టు ఒక అధ్యయనంలో తేలిందని మంత్రి అన్బుమణి వెల్లడించారు. |