దేశంలోని అన్ని పాఠశాలలో యోగాను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి అన్బుమణి రాందాస్ ప్రకటించారు. పిల్లల్లో క్రమంగా పెరుగుతూ పోతున్న జంక్ఫుడ్ కల్చర్కు స్వస్తి చెప్పి, వారి ఆరోగ్యానికి మేలు చేసే యోగా క్లాసులను నిర్వహించాలని తెలిపారు. భవిష్య భారతదేశం సంపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఈ దిశగా అడుగులు వేయాలన్నారు.
ప్రజారోగ్యంకోసం మంత్రి రాందాస్ ఇంతకుముందే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాలలో పొగతాగడాన్ని నిషేధించడమే కాక గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యులు తమ సేవలను తప్పనిసరిగా అందించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల బెంగళూరు పబ్ సంఘటనను దృష్టిలో పెట్టుకుని తాము కూడా పబ్ సంస్కృతికి వ్యతిరేకమని ప్రకటించారు. భారతీయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడటం మానుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.
పబ్లలో పూర్తి కాలాన్ని గడుపుతూ, జీవితాన్ని దానికే అంకితం చేస్తూ కాలం వెళ్లబుచ్చేవారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు తమ లెక్కలు చెపుతున్నాయన్నారు. జీవితాన్ని ప్రమాదపుటంచులకు తీసుకువెళ్లే అలవాట్లను తక్షణమే మానుకోవాలని పిలుపునిచ్చారు. |