చెన్నై హైకోర్టులో న్యాయవాదులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చెలరేగాయి. ఇవి శృతి మించిపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వీరిలో న్యాయమూర్తి ఆరుముగ పెరుమాల్ ఆదిత్యన్ కూడా ఉన్నారు. జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామిపై రెండు రోజుల క్రితం కోడిగుడ్ల దాడి జరిగిన విషయం తెల్సిందే.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురు మహిళా న్యాయవాదులతో సహా 14 మందిపై న్యాయవాదులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాజేంద్రన్ అనే న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామిపై ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు మేరకు స్వామిని అరెస్టు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
ఈ పరిస్థితుల్లో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. ఇవి తారా స్థాయికి చేరుకోవడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. నిగ్రహం కోల్పోయిన పోలీసులు హైకోర్టు ప్రాంగణంలో రౌడీలుగా ప్రవర్తించారు. పార్కింగ్ చేసిన వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు.
కంటికి కనిపించిన లాయర్లపై పోలీసులు లాఠీని జుళిపించారు. దీంతో పలువురు న్యాయవాదులకు రక్తపు గాయాలయ్యాయి. హైకోర్టు ప్రాంగణమంతా రణరంగాన్ని తలపించింది. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు బలగాలను అధికసంఖ్యలో మొహరించారు. పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది. |