యూపీఎకు మద్దతు తెలిపిన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో తన సంబంధాలను మరింత పటిష్టపరుచుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ ఇద్దరూ సోనియాగాంధీతో మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు పాల్గొంటారని సమాచారం.
కాంగ్రెస్తో తమ పొత్తు ఖరారవడమే కాక సీట్ల సర్దుబాటుపైనా మంతనాలు సాగుతాయని ఎస్పీ నేత అమర్ సింగ్ వెల్లడించారు. కాగా పక్షం రోజుల క్రితం కల్యాణ్సింగ్ను ఎస్పీ ఆహ్వానించడంతో కాంగ్రెస్, ఎస్పీల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి.
బాబ్రీ మసీదు కూల్చివేత వ్యవహారంలో కల్యాణ్సింగ్ ప్రధాన దోషిగా అభివర్ణిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ములాయం నిర్ణయం అసంతృప్తిని కలిగించింది. దీంతో కొంత కాలంగా ఇరు పార్టీల మధ్య దూరం పెరిగింది. ఈ నేపధ్యంలో మంగళవారం జరుగబోయే సమావేశంలో సమస్యలను పరిష్కరించుకుని ఇరు పార్టీలు సమిష్టిగా పోటీకి దిగుతాయన్న ఆశాభవంలో ఎస్పీ నేతలు ఉన్నారు. |