ముంబై మారణహోమానికి సంబంధించి శత్రుదేశం పాకిస్థాన్ అధికారులు సంధించిన 30 రకాల ప్రశ్నలకు ముంబై పోలీసులు తగు రీతిలో సమాధానాలను సిద్ధం చేసింది. ఈ దాడుల్లో ప్రాణాలతో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్పై తయారు చేసి, కోర్టుకు సమర్పించిన చార్జిషీటు నకళ్లకాపీని కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు శనివారం పంపారు.
పాక్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీలు వారం రోజుల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే, పాక్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ముంబై పోలీసులు ఇచ్చిన సమాధానంపై కేంద్రం సంతృప్తి చెందితేనే పాక్కు అధికారికంగా అందజేస్తారు. అలాగే, పాక్ కూడా మరికొన్ని రకాల ప్రశ్నలను సంధించవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు కేంద్రానికి పంపిన చార్జిషీటులో అజ్మల్ వాంగ్మూలంతో సహా గుజరాత్ పోర్టులో పడవలను హైజాక్ చేసిన తీరును విపులీకరించారు.
ఇదిలావుండగా, శుక్రవారం పాక్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ మాట్లాడుతూ ముంబై దాడులకు సంబంధించి పాక్ అడిగిన ప్రశ్నలకు భారత్ సమాధానం ఇవ్వక పోతే పాక్ పోలీసులు అరెస్టు చేసిన లష్కర్ ఎ తోయిబా కమాండర్లు జరర్ షా, జాకి ఉర్ రహ్మాన్ లఖ్వీని విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు పాక్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం గమనార్హం. కాగా, ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటును 11500 పేజీలతో రూపొందించారు. |