మహాత్మా గాంధీకి సంబంధించిన ఏ వస్తువులను భవిష్యత్తులో వేలం వేయడానికి వీలులేకుండా చేసే దిశగా భారతదేశం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించనుంది.
భవిష్యత్తులో గాంధీజీకి చెందిన ఏ వస్తువును ఎవరూ బహిరంగంగా వేలం వేయడానికి వీలులేకుండా చేసే మార్గాలేమిటన్నదానిపై తాము దృష్టి పెట్టామనీ, దీనిపై ఇప్పటికే అంతర్జాతీయ కోర్టులకు తమ విన్నపాలను పంపామని కళలు, సంస్కృతి శాఖకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు.
ఒక దేశానికి చెందిన వారసత్వ సంపదను బహిరంగ మార్కెట్లలో వేలం వేయడం చట్టరీత్యా నేరం. ఏ దేశంలోనైనా భారతదేశ వారసత్వ సంపదను వేలం వేయజూస్తే సంబంధిత దేశాల సహకారంతో తగిన చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
భవిష్యత్తులో గాంధీజీ వస్తువుల వేలం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ మరియు ఫ్రాన్స్ దేశాలలోని కోర్టులను ఆశ్రయించనుంది. దీనికి సంబంధించిన కసరత్తు కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతోంది. |