ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య సంబంధాలు పతనం అంచున వేలాడుతున్నాయి. రాజకీయంగా కీలకమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 80 సీట్లలో ఆరు సీట్లు మాత్రమే ఇస్తామని ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ పార్టీ ప్రతిపాదించింది.
ఈ విషయాన్ని ములాయం సింగ్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. మాజీ బీజేపీ నేత కళ్యాణ్ సింగ్తో ఆదివారం సమావేశం అనంతరం ములాయం కాంగ్రెస్కు తాము ఆరు సీట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎస్పీ ఆరు సీట్ల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది.
సమాజ్వాదీ ఇప్పటికే రాష్ట్రంలోని 65 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాను పునఃపరిశీలించేందుకు సిద్ధమని ప్రకటించిన కొన్ని గంటల తరువాత, ఎస్పీ తాము ఆరు సీట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేయడం గమనార్హం.
అయితే తమ డిమాండ్ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉద్ఘాటించింది. కాంగ్రెస్ పార్టీ యూపీలో 24 సీట్లు డిమాండ్ చేస్తోంది. ఎస్పీ దిగిరాకపోతే, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తాము నేరుగా పోటీ చేస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది.
మార్చి- 10న జరగాల్సి ఉన్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే తాము 24 సీట్ల డిమాండ్పై వెనక్కు తగ్గబోమని స్పష్టం చేసింది. ఈ 24 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించడం గమనార్హం. |