స్వతంత్ర నిర్ణయాధికారాలు లేని ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్తో సహా, యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు, దేశ ప్రజల మార్పు కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఓటర్లకు పిలుపునిచ్చారు. డెహ్రాడూన్లో ఆదివారం జరిగిన విజయ్ సంకల్ప్ యాత్రలో ఆయన పాల్గొని యూపీఏ సర్కారుపై విమర్శల వర్షం గుప్పించారు. దేశ హితాన్ని కాంక్షించి, మార్పు కోసం భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర నిర్ణయాధికారంలేని ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ను అభివర్ణించిన అద్వానీ.. ఇటువంటి పరిస్థితి ఏర్పడడం దేశ చరిత్రలోనే ఇదే ప్రప్రథమమని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ కేవలం కార్యాలయంలో ఉంటారు. ఆయనకు ఏ అధికారాలు లేవు. తన నివాసంలో ఉండే సోనియా అన్ని నిర్ణయాలు తీసుకుంటారు అని అద్వానీ విమర్శించారు. ప్రజాస్వామ్య భారతంలో ఏ విషయంపైనైనా తుది నిర్ణయం ప్రధానమంత్రిదే ఉండాలని ప్రస్తావించిన అద్వానీ, అత్యుత్తమమైన మార్పు కోసం భాజపాకు ఓటు చేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉగ్రవాదం పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నాయని ఆరోపించారు. దేశభద్రతపై యూపీఏ నిర్లక్ష్యధోరణిని అవలంభిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలకే పాల్పడుతోందని ధ్వజమెత్తారు. |