దేశంలో రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛా హక్కును ఇతర మతాలను అణచి వేసేందుకు ఓ పావులా ఉపయోగించరాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏమతాన్నైనా స్వీకరించే, ఆచరించే పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం కల్పిస్తోందని, అదే సమయంలో ఇతర మతాలను దూషించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో దేశంలో మతప్రాతిపదికన ప్రజలను వేరు చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత ఆయన తొలిసారి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పైవిధంగా వ్యఖ్యానించారు. మిలాదున్ నబీ పండుగ సందర్భంగా తన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జనవరి నెలాఖరులో ప్రధానికి గుండె ఆపరేషన్ జరిగిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన అన్ని రకాల అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వేగంగా కోలుకున్న ప్రధాని మెల్లగా తన నివాసంలో జరిగే కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. |